
అమరావతి, 11 జూలై (హి.స.)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భుజాలకు సర్జరీ చేయించుకోవటం కోసం ముంబైకి వెళ్లిన సంగతి తెలిసిందే. 2016లో తగిలిన గాయాలకు తోడు.. పోరాట యాత్ర నుంచి గత ఎన్నికల ప్రచారం వరకు పార్టీ శ్రేణులు, అభిమానులు చేతులుపట్టి లాగడంతో పవన్కు తీవ్రమైన రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ అయ్యాయని డాక్టర్లు తేల్చారు. రెండు భుజాలకు సర్జరీ చేయాలని చెప్పారు.
అయితే, రెండు భుజాలకు ఒకేసారి శస్త్ర చికిత్స చేయడం వల్ల నొప్పి తీవ్రత భరించలేని స్థాయిలో ఉంటుందని డాక్టర్లు పవన్కు సూచించారు. తొలుత కుడి భుజానికి సంబంధించి రొటేటర్ కఫ్ ఇంజ్యూరీకి శనివారం సర్జరీ చేశారు. మూడున్నర గంటలపాటు సర్జరీ సాగింది. మరో భుజానికి రెండు నెలల వ్యవధిలో సర్జరీ చేస్తామని డాక్టర్లు చెప్పారు. పవన్ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
పవన్ త్వరగా కోలుకోవాలి: సీఎం చంద్రబాబు
ఉప ముఖ్యమంత్రి సర్జరీ చేయించుకోవటంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో శనివారం ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టోలో.. ‘ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ సమయంలో ఆయనకు మంచి ఆరోగ్యం చేకూరాలని, తగిన శక్తి లభించాలని ప్రార్థిస్తున్నాను’ అని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ