
మదనపల్లె, 11 జూలై (హి.స.) రాయలసీమ ప్రాంతానికి గవర్నర్ కోటాలో భర్తీ చేయనున్న ఎమ్మెల్సీ పదవిని బలిజ సామాజిక వర్గానికి కేటాయించాలని బలిజ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. బలిజ సామాజిక వర్గానికి రాజకీయంగా తగిన గుర్తింపు, ప్రాతినిధ్యం కల్పించే దిశగా ఈ నిర్ణయం తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, బలిజ సామాజిక వర్గం రాష్ట్ర అభివృద్ధిలో, సామాజిక సేవా కార్యక్రమాల్లో, ప్రజా జీవితంలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ రాజకీయంగా ఆశించిన స్థాయిలో అవకాశాలు లభించడం లేదన్నారు.ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో బలిజ వర్గానికి విశేష జనాభా, బలమైన సామాజిక ఆధారం ఉన్నప్పటికీ ఎమ్మెల్సీ వంటి కీలక పదవుల్లో ప్రాతినిధ్యం దక్కకపోవడం బాధాకరమని పేర్కొన్నారు.
గవర్నర్ కోటాలో భర్తీ చేయనున్న ఎమ్మెల్సీ స్థానాన్ని బలిజ సామాజిక వర్గానికి కేటాయించడం ద్వారా ఆ వర్గానికి న్యాయం చేయడంతో పాటు సామాజిక సమతుల్యత కూడా సాధ్యమవుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని సానుకూలంగా పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV