
తిరుమల , 11 జూలై (హి.స.) తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ తీవ్రంగా పెరిగింది. వీకెండ్ (శనివారం) కావడంతో శ్రీవారి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో కొండపైకి తరలివచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. కంపార్ట్మెంట్లు దాటి వెలుపల ఉన్న క్యూలైన్లలో భక్తులు కిలోమీటర్ల మేర వేచి ఉన్నారు.దీంతో ఎలాంటి టైం స్లాట్ టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి (Sarvadarsanam) సుమారు 30 గంటల సమయం పడుతున్నట్లు అధికారులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ (TTD) అధికారులు క్యూలైన్లలో పాలు, తాగునీరు, అన్నప్రసాదాల పంపిణీని ముమ్మరం చేశారు.
ఇదిలా ఉంటే శుక్రవారం రోజు మొత్తం 73,265 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి భక్తిశ్రద్ధలతో తలనీలాలు సమర్పించి, మొక్కులు తీర్చుకున్న భక్తుల సంఖ్య 39,690 గా నమోదైంది. అలాగే శ్రీవారి హుండీ కానుకల ద్వారా నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో రూ. 4.26 కోట్ల ఆదాయం వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. రద్దీ దృష్ట్యా చిన్న పిల్లలు, వృద్ధులతో తిరుమల వచ్చే భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV