అమరావతికే వేల కోట్లు.. రాయలసీమకు ఒట్టి హామీలా?
అమరావతికే వేల కోట్లు.. రాయలసీమకు ఒట్టి హామీలా?
అమరావతికే వేల కోట్లు.. రాయలసీమకు ఒట్టి హామీలా?


కడప (వైఎస్సార్ కడప), 11 జూలై (హి.స.)మరావతి అభివృద్ధికి వేల కోట్లు కేటాయిస్తూ రాయలసీమను కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని గ్రేటర్ రాయలసీమ ప్రాజెక్టుల పరిరక్షణ సమితి కోఆర్డినేటర్ ఆరోపించారు.

రాయలసీమ అభివృద్ధి గురించి ఎన్నికల సమయంలో గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాంతాన్ని మరోసారి నిర్లక్ష్యానికి గురిచేస్తున్నారని, గ్రేటర్ రాయలసీమ ప్రాజెక్టుల పరిరక్షణ సమితి కోఆర్డినేటర్ శిబ్యాల విజయ భాస్కర్ అన్నారు. .

వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న రాయలసీమలో ప్రతి ఏడాది రైతుల చావులు,, రైతు కరువుతో, నీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని, ఇలాంటి పరిస్థితుల్లో సాగునీటి ప్రాజెక్టులను వేగవంతం చేయాల్సిన ప్రభుత్వం ఆ దిశగా చిత్తశుద్ధితో పనిచేయడం లేదనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోందన్నారు.

గత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రాయలసీమ శాశ్వత అభివృద్ధే లక్ష్యంగా హంద్రీ–నీవా, గాలేరు–నగరి వంటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టి కృష్ణా జలాలను రాయలసీమకు తీసుకురావాలని మహత్తర సంకల్పంతో ముందుకు సాగారన్నారు.

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమానాభివృద్ధే ఆయన ధ్యేయంగా పనిచేశారని, అయితే ఆయన అకాల మరణంతో అనేక ప్రాజెక్టులు మధ్యలోనే నిలిచిపోయాయన్నారు. ప్రాజెక్టులను పూర్తి చేసి రాయలసీమకు నీటి భద్రత కల్పించాల్సిన బాధ్యత తరువాతి ప్రభుత్వాలపై ఉన్నప్పటికీ, పదహారు సంవత్సరాలకు పైగా ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు రాయలసీమకు శాశ్వత ప్రయోజనం చేకూర్చే ఒక్క ప్రధాన సాగునీటి ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదనే విమర్శలు వినిపిస్తున్నాయన్నారు.

రాయచోటి సమీపంలోని శ్రీనివాస రిజర్వాయర్ నిర్మాణం పూర్తై సంవత్సరాలు గడిచినా, హంద్రీ–నీవా ద్వారా నీటిని అందించే పనులు నేటికీ పూర్తికాలేదన్నారు. ఈ రిజర్వాయర్కు నీరు చేరితే రాయచోటి, చిన్నమండెం సహా సుమారు ఏడు మండలాల రైతులకు సాగునీరు, లక్షలాది మందికి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. అయినప్పటికీ ఈ అంశంపై ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమన్నారు. మరోవైపు, రెండున్నరేళ్ల క్రితం వరదల్లో దెబ్బతిన్న అన్నమయ్య ప్రాజెక్టు పునర్నిర్మాణం కూడా ఇప్పటికీ పూర్తికాలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఆ ప్రాజెక్టు పనుల్లో ఆశించిన పురోగతి కనిపించడం లేదన్నారు.

ఈ ప్రాజెక్టుపై ఆధారపడిన రైతులు, గ్రామాలు ఇంకా అనిశ్చితిలోనే ఉన్నాయన్నారు. అమరావతి అభివృద్ధి పేరుతో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం ముందుకొస్తున్న వేళ, అందులో కొంత భాగమైనా రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు కేటాయిస్తే ఈ ప్రాంత భవిష్యత్తు పూర్తిగా మారిపోతుందని, రాయలసీమ కరువు సీమ నుంచి సస్యశ్యామలమైన రత్నాలసీమగా రూపాంతరం చెందుతుందన్నారు. రాజకీయ హామీలతో కాలం గడపకుండా, రాయలసీమ ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ హంద్రీ–నీవా, శ్రీనివాస రిజర్వాయర్, అన్నమయ్య ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం సకాలంలో పూర్తి చేసి అన్ని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande