
అమరావతి, 14 జూలై (హి.స.)
వియత్నాంలో జరిగిన పడవ ప్రమాదంలో మృతిచెందిన ఆంధ్రప్రదేశ్కు చెందిన ముగ్గురి మృతదేహాలు ఈరోజు(మంగళవారం) ఉదయం 7:30 గంటలకు హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయం కార్గో టెర్మినల్కు చేరుకున్నాయి. మృతుల్లో కడప జిల్లాకు చెందిన శ్రీథర్, మచిలీపట్నానికి చెందిన జయశ్రీ, హిందూపురానికి చెందిన రవితేజ ఉన్నారు. మృతదేహాలను భారత్కు తీసుకురావడానికి అవసరమైన అన్ని చట్టపరమైన ప్రక్రియలను ముంబైలో పూర్తి చేసిన తర్వాత కుటుంబసభ్యులకు అధికారులు నేరుగా అప్పగించారు. అనంతరం శంషాబాద్ విమానాశ్రయం నుంచి వారి స్వస్థలాలకు తరలించే ఏర్పాట్లు చేశారు.
ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని మృతుల కుటుంబసభ్యులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ.. కుటుంబసభ్యులకు, సన్నిహితులకు ధైర్యం చెప్పారు. మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపించే ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించారు. హైదరాబాద్ నుంచి కడప, మచిలీపట్నం, హిందూపురం ప్రాంతాలకు మృతదేహాలను తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత అంబులెన్స్ సదుపాయం కల్పించింది. బాధిత కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హామీ ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ