అంతరిక్ష రంగంలో ఖమ్మం యువకుడి ప్రతిభ.. విక్రమ్-1 విజయానికి కీలక సహకారం
అంతరిక్ష రంగంలో ఖమ్మం యువకుడి ప్రతిభ.. విక్రమ్-1 విజయానికి కీలక సహకారం
Khammam


ఖమ్మం, 20 జూలై (హి.స.)

ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మాధాపురం గ్రామానికి చెందిన మోర్తాల నరేందర్ రెడ్డి భారత అంతరిక్ష రంగంలో విశేష ప్రతిభకనబరుస్తూ జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. రైతు కుటుంబంలో జన్మించిన నరేందర్ రెడ్డి తండ్రి మోర్తాల హనుమి రెడ్డి రైతు కాగా, తల్లి లక్ష్మి, సతీమణి శ్రీ వెంకట దివ్య, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, సహకారంతో అంతరిక్ష రంగంలో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. ప్రస్తుతం ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్లో టీమ్ లీడ్ – ఇంటిగ్రేషన్ & టెస్టింగ్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఇటీవల విజయవంతంగా నిర్వహించిన విక్రమ్-1 రాకెట్ ప్రయోగంలో కీలక బృందం సభ్యుడిగా పనిచేసి మిషన్ విజయానికి తన వంతు సహకారం అందించారు. పదేళ్లకు పైగా అంతరిక్ష, రక్షణ రంగాల్లో అనుభవం కలిగిన నరేందర్ రెడ్డికి లాంచ్ వెహికల్ ఇంటిగ్రేషన్, లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్, టెస్టింగ్, లాంచ్ ఆపరేషన్స్ విభాగాల్లో విశేష నైపుణ్యం ఉంది. భారత అంతరిక్ష రంగ అభివృద్ధిలో తన వంతు సేవలందించడం గర్వకారణంగా భావిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఖమ్మం జిల్లా యువకుడు దేశ అంతరిక్ష రంగంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ విజయాలు సాధించడం జిల్లావాసులకు గర్వకారణమని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande