
న్యూఢిల్లీ, 20 జూలై (హి.స.)
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై
ఏఐసీసీ (AICC) అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పార్లమెంట్ ముట్టడికి యత్నించిన సీజేపీ విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. విద్యార్థులపై జరిగిన ఈ దాడి కేవలం వారిపై జరిగింది కాదని, నిలువెత్తు ప్రజాస్వామ్యంపై జరిగిన దాడేనని ఆయన మండిపడ్డారు. అయోధ్య రాముడి మందిరానికి సంబంధించిన విరాళాల చోరీ అంశంపై పార్లమెంట్లో తాము స్పష్టమైన ప్రశ్నలు లేవనెత్తామని ఖర్గే తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అయోధ్య ట్రస్టు ఏర్పాటు చేసినప్పుడు అందులో ప్రధాని మోడీ కూడా భాగస్వామిగా ఉన్నారని, ట్రస్ట్ స్థాపకుల్లో ఆయన ఒకరని గుర్తుచేశారు. కోట్లాది మంది భక్తులు ఎంతో నమ్మకంతో సమర్పించిన విరాళాలు చోరీకి గురవ్వడం తీవ్రమైన విషయమేని, ఈ చోరీ ఘటనకు ప్రధాని మోడీ బాధ్యత వహించాలని ఖర్గే డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను, అక్రమాలను ప్రశ్నిస్తున్న విద్యార్థులపై, ప్రతిపక్షాలపై బలప్రయోగానికి దిగడం సరికాదని ఆయన హితవు పలికారు. మోడీ ప్రభుత్వానికి దమ్ము లేదని.. ప్రభుత్వంలో కూర్చునే అర్హత కోల్పోయారని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..