
తిరుమల, 21 జూలై (హి.స.) తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం ఉదయం 7 గంటల సమయానికి స్వామివారి సర్వదర్శనం కోసం వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని కంపార్టుమెంట్లన్నీ నిండి.. శిలాతోరణం వరకూ క్యూలైన్లో భక్తులు వేచి ఉన్నారు. ఉదయం 8 గంటల తర్వాత టోకెన్లు లేకుండా సర్వదర్శనానికి క్యూలైన్లోకి వెళ్లే భక్తులకు శ్రీవారి దర్శనానికి 20-24 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. రూ.300 శీఘ్రదర్శనానికి 3-5 గంటలు, సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్ పొందిన భక్తులకు 5-7 గంటల సమయం పడుతుందని పేర్కొన్నారు. కాగా.. నిన్న (సోమవారం) స్వామివారిని 80,214 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 36,994 మంది భక్తులు స్వామివారికి తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకలతో స్వామివారి హుండీ ఆదాయం రూ.4.81 కోట్లు సమకూరగా.. 4.18 లక్షల లడ్డూలను విక్రయించారు. 2.25 లక్షల మంది భక్తులు స్వామివారి అన్నప్రసాదాలను స్వీకరించారు. ఇదిలా ఉండగా.. ఈ రోజు ఉదయం 10 గంటలకు అక్టోబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV