
అమరావతి, 21 జూలై (హి.స.)
వైసీపీ నేత, ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారం భూ అక్రమాలపై తప్పకుండా చర్యలు ఉంటాయని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్స్పష్టం చేశారు. గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు భూమిపై చట్టవిరుద్ధంగా వ్యవహరించిన వారిపై కూడా చర్యలు ఉంటాయని తేల్చిచెప్పారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలోని ఐదేళ్లలో జరిగిన అన్ని అక్రమాలపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈరోజు (మంగళవారం) అమరావతి వేదికగా మీడియాతో మంత్రి అనగాని మాట్లాడారు.
గొడ్డలి పార్టీకి రాజకీయ స్వలాభం కోసమే అసత్య ఆరోపణలు చేస్తోందని మంత్రి అనగాని ధ్వజమెత్తారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సామాన్యుల ఇబ్బందులు తొలగించేవే ఆర్ఎస్కేలు అని వెల్లడించారు. ఇవి ప్రజలకు మేలు చేసేవే తప్ప.. వీటివల్ల ఏ ఒక్కరికీ నష్టం లేదని స్పష్టం చేశారు. డాక్యుమెంట్ రైటర్లను పిలిపించి మాట్లాడితే వారు కూడా దీనిపై సానుకూలంగా స్పందించారని అన్నారు. కొందరు, కొన్ని రాజకీయ పార్టీల నేతలు స్వార్థం కోసం వేసే ట్రాప్లో పడొద్దని కోరారు. రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా ఆర్ఎస్కేలు ఓ నూతన సాంకేతిక విధానమని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ