
అమరావతి, 21 జూలై (హి.స.)
:శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నగర పంచాయతీ ప్రజల తాగునీటి సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెనుకొండ పట్టణానికి తాగునీటి సరఫరా కోసం గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి 0.18 టీఎంసీల నీటిని కేటాయిస్తూ జీవో జారీ అయ్యింది. ఏవీఆర్ హంద్రీ-నీవా సుజల స్రవంతి(HNSS) ప్రాజెక్టు నుంచి నీటిని కేటాయించనున్నారు. ఈ మేరకు జలవనరుల శాఖ జీఓ ఆర్.టి. నెం.395ను విడుదల చేసింది.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, పెనుకొండ నగర పంచాయతీ తాగునీటి అవసరాలకు 0.18 టీఎంసీల నీటిని కేటాయించనున్నారు. అమృత్ 2.0 పథకం కింద తాగునీటి మౌలిక వసతులకు నీటిని వినియోగించనున్నారు. రాష్ట్ర జల విధానానికి అనుగుణంగా తాగునీటి అవసరాలకే తొలి ప్రాధాన్యం ఇస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇంజినీర్-ఇన్-చీఫ్ సమర్పించిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. నీటి కేటాయింపుకు సంబంధించి తదుపరి చర్యలు చేపట్టాలని ఇంజినీర్-ఇన్-చీఫ్ను సర్కార్ ఆదేశించింది. ఈ నిర్ణయంతో పెనుకొండ ప్రజలకు తాగునీటి సమస్య పరిష్కారానికి మరో ముందడుగు పడిందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ