
రియాసి (జమ్మూ కాశ్మీర్) , 21 జూలై (హి.స.)
జమ్మూ కాశ్మీర్లోని రియాసి జిల్లాలో గత కొన్ని గంటలుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చీనాబ్ నది, డ్యామ్ జలాశయానికి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో సలాల్ డ్యామ్ నీటి మట్టాన్ని నియంత్రించడానికి మరియు అదనపు నీటిని కిందకు విడుదల చేయడానికి మంగళవారం డ్యామ్ గేట్లు అన్నింటినీ అధికారులు ఎత్తివేశారు. డ్యామ్ నుంచి పెద్ద ఎత్తున నీటిని విడుదల చేస్తుండటంతో చీనాబ్ నదిలో నీటి ప్రవాహం మరియు నీటి మట్టం ఒక్కసారిగా తీవ్రంగా పెరిగాయి
ఈ నేపథ్యంలో నదీ తీర ప్రాంతాల్లో మరియు లోతట్టు ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఎవరూ కూడా నదికి దగ్గరగా వెళ్లవద్దని సూచించారు. కాగా, జమ్మూ కాశ్మీర్లోని రాజౌరీ జిల్లాలో కూడా తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షాల వల్ల వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం పొంచి ఉండటంతో జిల్లా యంత్రాంగం, పోలీసులు ప్రజలకు అత్యవసర అడ్వైజరీలు జారీ చేస్తూ అప్రమత్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi