ఆరుతడి పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలి.. అడిషనల్ కలెక్టర్
ఆరుతడి పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలి.. అడిషనల్ కలెక్టర్
Collector


ఖమ్మం, 22 జూలై (హి.స.)

వర్షాభావ పరిస్థితులను దృష్టిలో

ఉంచుకుని రైతులు అధిక నీటి అవసరమయ్యే పంటలకు బదులుగా ఆరుతడి, ప్రత్యామ్నాయ పంటల సాగుపై శ్రద్ధ కనబరచాలని ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) శ్రీజ సూచించారు. బుధవారం ఏన్కూర్ రైతు వేదికలో వర్షాభావ పరిస్థితులపై మండల స్థాయి అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో రైతులు వరి, మొక్కజొన్న, మిరప వంటి అధిక నీటి అవసరమయ్యే పంటలకు దూరంగా ఉండాలని సూచించారు. వాటికి బదులుగా కందులు, పెసర్లు, మినుములు వంటి అపరాల పంటలు, జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు వంటి తృణధాన్యాలు, అలాగే నువ్వులు, వేరుశెనగ వంటి నూనెగింజల పంటలను సాగు చేయడం ద్వారా ఎల్నినో ప్రభావాన్ని అధిగమించవచ్చని తెలిపారు.

అలాగే రైతులు పంట కుంటల నిర్మాణంపై దృష్టి పెట్టాలని ఆమె సూచించారు. పంట కుంటల వల్ల సాగునీటి నిల్వ, చేపల పెంపకం, భూగర్భ జలాల పునరుద్ధరణ (రీచార్జ్) వంటి అనేక ప్రయోజనాలు కలుగుతాయని వివరించారు. ఐదు ఎకరాల వరకు భూమి కలిగి, జాబ్ కార్డు ఉన్న సన్న, చిన్నకారు రైతులు పంట కుంటల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande