కస్తూర్బా విద్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..
కస్తూర్బా విద్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..
Collector


మెదక్, 25 జూలై (హి.స.)

విద్యార్థినుల అభ్యాస సామర్థ్యాలను

స్వయంగా పరిశీలించేందుకు మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ చేగుంట మండలం రెడ్డిపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని శనివారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా తరగతి గదిలో విద్యార్థినులతో మమేకమై స్వయంగా పాఠాలు బోధించి విద్యార్థినుల చదవడం అర్థం చేసుకునే సామర్థ్యాలను పరీక్షించారు. విద్యార్థినులకు నాణ్యమైన విద్య అందించడంలో ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అనంతరం పాఠశాల ఆవరణ వంటశాల భోజనశాల వసతి గదులను పరిశీలించిన కలెక్టర్ అన్ని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసేలా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

కిచెన్ గార్డెన్ల ద్వారా విద్యార్థినులకు తాజా కూరగాయలు అందించడంతో పాటు ప్రకృతి పట్ల అవగాహన పెంపొందుతుందని పేర్కొన్నారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు పరిశుభ్రతకు నిలయాలుగా మారాలని ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో బాలికలు విద్యను అభ్యసించేలా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. --

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande