
హైదరాబాద్, 22 జూలై (హి.స.)
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా కలం పట్టిన విప్లవ మహాకవి, జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత డాక్టర్ దాశరథి కృష్ణమాచార్యుల జయంతి సందర్భంగా బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్), పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చాటిచెప్పి, తన అక్షరాలతో తెలంగాణ సమాజంలో ఉద్యమ స్ఫూర్తిని రగిల్చిన మహనీయుడు దాశరథి అని వారు కొనియాడారు. తెలంగాణ అస్తిత్వాన్ని, ఇక్కడి ప్రజల ఆకాంక్షలను ప్రపంచానికి చాటిన దాశరథి సాహిత్యం ఎప్పటికీ చిరస్మరణీయమని, ఆయన చూపిన బాట నేటి తరానికి ఆదర్శనీయమని పేర్కొన్నారు. దాశరథి జయంతిని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఆయన సేవలను స్మరించుకుంటూ పలువురు నేతలు, కవులు ఘన నివాళులు అర్పించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi