నీట్ పేపర్ లీకేజీపై కేంద్రం బాధ్యత వహించాలి.. వర్ధన్నపేట ఎమ్మెల్యే
నీట్ పేపర్ లీకేజీపై కేంద్రం బాధ్యత వహించాలి.. వర్ధన్నపేట ఎమ్మెల్యే
MLA


వరంగల్, 24 జూలై (హి.స.)

నీట్ పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీ

ఘటనపై బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ ఆధ్వర్యంలో పర్వతగిరి మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద శుక్రవారం నిర్వహించిన ధర్నాలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు విద్యార్థులపై జరిగిన దాడులు, అరెస్టులు, లాఠీచార్జీలను తీవ్రంగా ఖండించారు.

కేంద్ర ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీతో పరీక్షా వ్యవస్థపై ప్రజల్లో అనుమానాలు నెలకొన్నాయని, వాటిని వెంటనే నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీకేజీ కారణంగా పలువురు విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొంటూ, దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరారు. విద్యార్థుల నిరసనలపై బలప్రయోగం చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. విద్యార్థులపై దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande