
కర్నూలు, 24 జూలై (హి.స.)తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ ఉపశమనాన్నిచ్చే చల్లని కబురు అందించింది. గడిచిన కొన్ని రోజులుగా తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోయిన జనాలు.. ప్రస్తుతం కురుస్తున్న వానలతో ఊపిరి పీల్చుకుంటున్నారు. బంగాళాఖాతంలో ద్రోణి, రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాబోయే రెండు మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇటీవలి వరకు నైరుతి రుతుపవనాల మందగమనం, ఎల్నినో ప్రభావం వల్ల రెండు రాష్ట్రాల్లోనూ తీవ్రమైన లోటు వర్షపాతం నమోదైనప్పటికీ ఈ కొత్త వర్షాల రాకతో ముఖ్యంగా రైతాంగంలో ఆశలు చిగురిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్లోని ఈ జిల్లాలకు అలర్ట్
అమరావతి వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎన్టీఆర్, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, చిత్తూరు, కాకినాడ, పోలవరం, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయని హెచ్చరించింది. మరోవైపు మార్కాపురం, నంద్యాల, ప్రకాశం, విశాఖపట్నం, పల్నాడు, బాపట్ల, అనకాపల్లి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే చాన్స్ ఉంది. వర్షం కురిసే సమయంలో గంటకు ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున, పొలాల్లో పనిచేసే రైతులు, పశువుల కాపరులు చెట్ల కింద లేదా కరెంట్ స్తంభాల వద్ద నిలబడకుండా సురక్షిత ప్రదేశాల్లో తలదాచుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV