

శ్రీశైలం, 24 జూలై (హి.స.) శ్రావణశుద్ధ పాడ్యమి, ఆగస్టు 13 నుంచి శ్రావణ మాసోత్సవాలు నిర్వహింపబడనున్నాయిని శ్రీశైల దేవస్థానం ఈవో ఎం శ్రీనివాసరావు తెలిపారు. భాద్రశుద్ధ పాడ్యమి సెప్టెంబరు 12 ఉదయాన ఈ మాసోత్సవాలు ముగుస్తాయి.
ఈ మాసోత్సవాల ఏర్పాట్లకు సంబంధించి కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు ప్రాథమిక సమావేశాన్ని నిర్వహించారు.
పరిపాలనా కార్యాలయములోని సమావేశమందిరములో నిర్వహించబడిన ఈ సమావేశంలో అర్చకస్వాములు, వేదపండితులు, డిప్యూటీ కార్యనిర్వహణాధికారి, అన్ని విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, ఇంజనీరింగ్ అధికారులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ శ్రావణమాస ఏర్పాట్లపై రాబోవు ధర్మకర్తల మండలి సమావేశంలో కూలంకషంగా చర్చించి తదనుగుణంగా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ శ్రావణమాసోత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రలతో పాటు పలు ఉత్తరాది రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో క్షేత్రాన్ని సందర్శిస్తారన్నారు. ముఖ్యంగా శ్రావణమాసంలో రద్దీ దృష్ట్యా అన్ని విభాగాలు కూడా తగు ముందస్తు ప్రణాళికలతో ఉత్సవ నిర్వహణకు సిద్ధం కావాలని ఆదేశించారు. భక్తులరద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని విభాగాల వారు కూడా ముందస్తుగా ఆయా ఏర్పాట్లను చేయాలని ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV