గుంతకల్ బళ్ళారి మధ్య 3,వ 4వ రైల్వే లైన్ నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుంతకల్ బళ్ళారి మధ్య 3,వ 4వ రైల్వే లైన్ నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
train


అమరావతి, 25 జూలై (హి.స.)

గుంతకల్ - బళ్లారి మధ్య 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రాజెక్టు తూర్పు-పడమర రైల్వే కారిడార్ను మరింత బలోపేతం చేస్తుందని చెప్పారు. రాయలసీమ, ఉత్తర కర్ణాటక, గోవా మధ్య అనుసంధానాన్ని మెరుగుపరుస్తుందని అన్నారు. రైల్వే రద్దీ తగ్గనుందని.. ప్రయాణీకులు, సరుకుల రవాణాను వేగవంతం చేస్తుందన్నారు.

రూ.1264 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులో దాదాపు రూ.600 కోట్లు ఏపీలో ఖర్చుకానున్నాయని సీఎం వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ పారిశ్రామిక వృద్ధిని పెంచడంతో పాటు.. కృష్ణపట్నం, రాబోయే రామాయపట్నం పోర్టుకు అనుసంధానాన్ని మెరుగుపరుస్తుందన్నారు. కొత్త ఆర్థిక అవకాశాలు ఏర్పాడి.. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వ్యాప్తంగా లక్షలాది మందికి ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల నిర్మాణానికి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిరంతర మద్దతుకు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలియజేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande