
విశాఖపట్నం, 28 జూలై (హి.స.)
విశాఖపట్నంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచల వరాహ లక్ష్మీనరసింహస్వామి వార్షిక గిరిప్రదక్షిణ మహోత్సవం ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు మొదటి పావంచా వద్ద అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఈ పవిత్రమైన 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ కోసం ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా సుమారు 6 లక్షల మందికి పైగా భక్తులు తరలివచ్చారు. భక్తుల రద్దీ మరియు ట్రాఫిక్ మళ్లింపులను దృష్టిలో ఉంచుకుని విశాఖ జిల్లా యంత్రాంగం గిరిప్రదక్షిణ మార్గంలో ఉన్న 221 పాఠశాలలు, కళాశాలలకు ఈరోజు మరియు రేపు (జూలై 28, 29) రెండు రోజుల పాటు సెలవు ప్రకటించింది. భక్తుల భద్రత కోసం వందలాది సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి గట్టి నిఘా ఉంచారు. భక్తుల రద్దీ దృష్ట్యా దేవస్థానంలో ఆర్జిత సేవలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi