
అమరావతి, 25 ఆగస్టు (హి.స.)
ఆంధ్రప్రదేశ్లో జూనియర్ వైద్యులు సమ్మెను విరమించారు. ఈ విషయాన్ని జూడాలు.. హైకోర్టుకు నివేదించారు. తమ డిమాండ్లను పరిష్కరించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని వారు హైకోర్టును అభ్యర్థించారు. జూనియర్ వైద్యుల సమ్మెపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)పై ఈరోజు(మంగళవారం) హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జూడాలు సమ్మె విరమిస్తున్నట్లు న్యాయస్థానానికి తెలియజేశారు. అదే సమయంలో తమ డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోర్టును కోరారు.
జూనియర్ వైద్యుల డిమాండ్లను పరిష్కరించే అంశంపై రెండు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దీంతో ఏపీలో జూనియర్ వైద్యుల సమ్మెకు ప్రస్తుతానికి తెరపడినట్లైంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ