
మంచిర్యాల, 25 ఆగస్టు (హి.స.) మొక్కలు నాటి సంరక్షించి పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా సమతుల్య వాతావరణాన్ని నిర్మించవచ్చని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లాలోని మందమర్రి మండలం బొక్కలగుట్ట ప్రాంతంలోని గాంధారి వనంలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా డీసీపీ ఎ. భాస్కర్, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య, జిల్లా అటవీ అధికారి రాహుల్ కిషన్ జాదవ్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ, మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాజేశ్వర్లతో కలిసి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో మొక్కలు నాటి సంరక్షించడం ద్వారా భావితరాలకు సహజమైన సమతుల్య వాతావరణాన్ని అందించవచ్చని తెలిపారు. చెట్ల ద్వారా మనకు కావలసిన సహజ వాయువు, ఆరోగ్యకరమైన ఆహారం, ఆశ్రయం లభిస్తాయని, వర్షాలు సమృద్ధిగా ఉంటాయని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మంగళవారం రోజున 4 లక్షల మొక్కలను నాటడం జరిగిందని, జిల్లాకు నిర్దేశించిన 41 లక్షల మొక్కల లక్ష్యాన్ని దాదాపు 80 శాతం పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటడమే కాకుండా సంరక్షించాలని, సమతుల్య వాతావరణ నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..