
శ్రీశైలం, 27 ఆగస్టు (హి.స.)
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పూర్తిగా నిలిచిపోయింది. మరోవైపు ఎగువన ఉన్న కాలువలు, ప్రాజెక్టులకు, విద్యుదుత్పాదనకు నీటి వినియోగంతో ఉన్న నిల్వలు కూడా తరిగిపోతున్నాయి. ఇటు గోదావరి నదిలో వరద అనూహ్యంగా పెరిగింది. సముద్రంలోకి 5లక్షలకుపైగా క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. శ్రీశైలం కుడిగట్టు విద్యుత్తు కేంద్రలో ఏపీ ఉత్పత్తి నిలిపివేసినప్పటికీ.. తెలంగాణ ఎడమగట్టున విద్యుదుత్పత్తి కొనసాగించి 35,315 క్యూసెక్కులను దిగువకు నీరు విడుదల చేశారు. పోతిరెడ్డిపాడు నుంచి 8,000 క్యూసెక్కులు, హంద్రీ- నీవాకు 3,050 క్యూసెక్కులు, కల్వకుర్తికి 2,400 క్యూసెక్కులు, ఆవిరిరూపంలో 141 క్యూసెక్కుల నీరు విడుదలై మొత్తంగా 48,906 క్యూసెక్కులు అవుట్ఫ్లో నమోదైంది. జలాశయం గరిష్ఠ సామర్థ్యం 215.80 టీఎంసీలకుగాను ప్రస్తుతం 162.05 టీఎంసీల నిల్వ ఉంది. బుధవారం జూరాల ప్రాజెక్టు విద్యుదుత్పత్తి నుంచి 14,359 క్యూసెక్కులు విడుదల కాగా.. 15,219 క్యూసెక్కుల నీరు సాయంత్రానికి శ్రీశైలం వచ్చి చేరినట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. కర్ణాటకలోని ఆలమట్టి, నారాయణపూర్ డ్యాంలు పూర్తిగా నిండినప్పటికీ ఎగువ నుంచి వరద తగ్గడంతో దిగువకు వదిలే ప్రవాహం కూడా బాగా తగ్గిపోయింది. బుధవారం ఆలమట్టిలోకి 28,746 క్యూసెక్కులు రాగా.. 21,825 క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు. నారాయణపూర్లోకి 18,009 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. 20,474 క్యూసెక్కులు వదిలారు. నాగార్జునసాగర్కు 20,500 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. ఎస్ఎల్బీసీ ద్వారా 2వేల క్యూసెక్కులు వదులుతున్నారు. పులిచింతలకు ఎలాంటి ప్రవాహమూ లేదు.
పోలవరంలోకి 5.10 లక్షల క్యూసెక్కులు
ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉపనదులు ఇంద్రావతి, ప్రాణహిత, శబరి, సీలేరు జలాలతో గోదావరి నీటిమట్టం బుధవారం అనూహ్యంగా పెరిగింది. భద్రాచలం వద్ద 5,83,563 క్యూసెక్కులు ప్రవహిస్తుండగా.. పోలవరం ప్రాజెక్టులోకి 5,10,872 క్యూసెక్కుల వరద వస్తోంది. దీనిని స్పిల్వే నుంచి దిగువకు విడుదల చేసినట్లు డీఈఈ వెంకటేశ్వరరావు తెలిపారు. సాయంత్రానికి ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్లో 158 గేట్లను ఒక మీటరు పైకిఎత్తి 4,63,583 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. వ్యవసాయ అవసరాలకు తూర్పు డెల్టా కాలువకు 5000, మధ్య డెల్టా కాలువకు 2800, పశ్చిమ డెల్టా కాలువకు 7000 క్యూసెక్కుల చొప్పున వదిలారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ