
చీరాల, :, 31 ఆగస్టు (హి.స.)
చీరాలకు చెందిన గొర్ల పూర్ణస్వామి ఇటీవల తిరుపతిలో జరిగిన అమరావతి ఛాంపియన్షిప్ వెయిట్లిఫ్టింగ్ పోటీల్లో బంగారు పతకం సాధించి అందరి మన్ననలు పొందాడు. తోటవారిపాలెం సాయి విద్యా కేంద్రంలో పదో తరగతి చదువుతున్న ఇతను రెండేళ్లుగా ఈపూరు పాలెంలో గోపీ వద్ద శిక్షణ పొందుతున్నాడు. తండ్రి నరేంద్ర గుమస్తాగా పనిచేస్తుంటారు. మొదటి నుంచీ క్రీడలపై ఉత్సాహం చూపుతుండటంతో ఆయన కుమారుడిని ప్రోత్సహించారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా స్వామి క్రీడల్లోనూ రాణిస్తున్నాడు.
అంతర్జాతీయ స్థాయిలో రాణించడమే లక్ష్యం.. రెండేళ్ల కిందట రాష్ట్రస్థాయి పాఠశాలల క్రీడల్లో షాట్ఫుట్లో రజత, డిస్కస్లో కాంస్య పతకాలు సాధించి సత్తా చాటాడు. తాజాగా జరిగిన అమరావతి క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్లో 17 సంవత్సరాల్లోపు 70 కేజీల విభాగంలో బరిలోకి దిగి జిల్లా, జోనల్ స్థాయిలో బంగారు పతకాలు కైవసం చేసుకున్నాడు. చివరగా తిరుపతిలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో స్నాచ్లో 85, క్లీన్అండ్జర్క్లో 107 కేజీల బరువు ఎత్తి ఎదురులేని విజయం సాధించి బంగారు పతకం అందుకున్నాడు. త్వరలో జరిగే రాష్ట్రస్థాయి పాఠశాలల క్రీడలపై దృష్టి పెట్టానని బంగారు పతకమే లక్ష్యంగా సాధన చేస్తున్నానని పూర్ణస్వామి తెలిపాడు. అంతర్జాతీయ స్థాయిలో రాణించడమే తన లక్ష్యమని చెబుతున్నాడు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ