పెద్దపల్లి కలెక్టరేట్, 26 ఏప్రిల్ (హిం.స) సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలుకు గురువారం గడువు ముగియగా పెద్దపల్లిలో ఇద్దరు అభ్యర్థులు సమయం ముగిసిన తర్వాత వచ్చారని అధికారులు అనుమతించలేదు.
దళిత బహుజన పార్టీ అభ్యర్థి మాతంగి హన్మయ్య నామినేషన్ వేయడానికి కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్దకు రాగా అప్పటికి మధ్యాహ్నం 3 గంటలు దాటిందని అధికారులు లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో హన్మయ్య అక్కడే ఉన్న పెద్దపల్లి తహసీల్దార్ రాజ్కుమార్ కాళ్ల మీద పడటానికి యత్నించగా వారించారు. అనంతరం హన్మయ్య మాట్లాడుతూ తాను 3 గంటల్లోపే వచ్చానని పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం, జాతీయ మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తానన్నారు. కాగా వచ్చిన సమయం సీసీ కెమెరాలో నిక్షిప్తమవుతుందని అధికారులు స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం మధ్యాహ్నం 3 గంటలు కాగానే మైక్లో ప్రకటించి తలుపులు మూసివేశామని చెప్పారు. స్వతంత్ర అభ్యర్థి దాసరి శ్రీకాంత్ కూడా ఆలస్యంగా రావడంతో అధికారులు అనుమతించలేదు.
హిందూస్తాన్ సమాచార రాజీవ్