అమరావతి, 19 సెప్టెంబర్ (హి.స.)
అమరావతి : ఏపీ వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న హౌసింగ్ కాలనీలోని ఇళ్లను మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. గుంటూరు జిల్లా పేరేచర్ల హౌసింగ్ కాలనీలో ఉన్న లేఅవుట్లను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. లబ్ధిదారులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
పేరేచర్ల హౌసింగ్ కాలనీలో మొత్తం 18వేలకు గాను 11వేల ఇళ్ల నిర్మాణాలను చేపట్టినట్లు వివరించారు. ఇళ్ల నిర్మాణంలో చోటుచేసుకున్న అవకతవకలపై సీఎం చంద్రబాబు విజిలెన్స్ విచారణ వేశారన్నారు. ఆ నివేదిక ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం తరఫున గుత్తేదారులకు పూర్తి సహకారం అందిస్తామని, వీలైనంత త్వరగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. 2025 మార్చి దాటితే లబ్ధిదారులకు బ్యాంకు రుణం వచ్చే పరిస్థితి ఉండదన్నారు. హౌసింగ్ కాలనీల్లో విద్యుత్తు, రహదారులు, తాగునీరు ఇలాంటి మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. నాణ్యత లేకుండా నిర్మించిన ఇళ్ల స్థానంలో కొత్త ఇళ్లు నిర్మించి ఇస్తామని లబ్ధిదారులకు భరోసా ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల