హైదరాబాద్, 7 సెప్టెంబర్ (హి.స.)మహిళల భద్రతపై మాట్లాడే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వారిపై జరుగుతున్న అఘాయిత్యాలు గురించి మాట్లాడాలని హితవు పలికారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణ జైనూరులో ఆదివాసి మహిళపై జరిగిన అఘాయిత్యం కనిపించలేదా?.. ఇదేనా మార్పు అని ప్రశ్నించారు.
మహిళల భద్రత విషయంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి కిషన్రెడ్డి కౌంటరిచ్చారు. తాజాగా కిషన్ రెడ్డి..‘మహిళల భద్రతపై మొసలి కన్నీరు కాదు. కళ్లు తెరిచి చూడు రాహుల్. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రోజుకో అఘాయిత్యం, వేధింపుల పర్వం కొనసాగుతోంది. మహిళలకు రక్షణ కల్పించలేని కాంగ్రెస్ ప్రభుత్వాలు మహిళల భద్రతపై మాట్లాడటం హాస్యాస్పదం. మహిళల భద్రతపై కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి వివక్ష తగదు. భద్రతకు అభయమివ్వని హస్తానికి అధికారమెందుకు?.
బీజేపీ పాలిత రాష్ట్రంలో జరిగిన ఓ ఘటన గుర్తుకు రాగానే.. నిద్రలోంచి లేచి మహిళలపై అఘాయిత్యాలు దారుణం అని ప్రకటనలు గుప్పించే రాహుల్కు తెలంగాణలోని ఆసిఫాబాద్ జిల్లా జైనూర్లో ఆదివాసీ మహిళపై జరిగిన అమానవీయ ఘటన గుర్తుకు రాలేదా?. మైనారిటీ సంతుష్టికరణ విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్ పార్టీకి, రాహుల్కు ఆదివాసీ మహిళకు న్యాయం చేయాలనే ఆలోచన ఎందుకు రావడం లేదు?. అత్యాచారానికి పాల్పడిన ఆటో డ్రైవర్ మైనార్టీ కావడంతోనే రాహుల్, కాంగ్రెస్ ఈ ఘటనను దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు