అమరావతి, 15 అక్టోబర్ (హి.స.)
అమరావతి: ఉమ్మడి కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలతో మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) సమావేశమయ్యారు. నకిలీ మద్యం కేసు, జిల్లాలో తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో అద్భుతమైన అభివృద్ధి జరుగుతోందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. వైకాపా నేతలు రాష్ట్రంలో అస్థిరత తీసుకురావాలని చూస్తున్నారని మండిపడ్డారు. కుట్రలు అన్నీ కృష్ణా జిల్లా నుంచే జరగడం దురదృష్టకరమన్నారు. అన్ని మద్యం దుకాణాల వద్ద లిక్కర్ చెకింగ్ డివైజ్ పెడుతున్నామని, సామాన్యుడు కూడా తనిఖీ చేసుకోవచ్చన్నారు. సహజ మరణాలను కూడా లిక్కర్ మరణాలుగా చూపించి.. ప్రజలను భయాందోళనలకు గురిచేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.
జగన్ జే బ్రాండ్స్ పెట్టి నకిలీ మద్యంతో దోపిడీ చేశారని ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తుంటే.. వైకాపా దుష్ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ మద్యం కేసులో నిందితుడు అద్దేపల్లి జనార్దనరావు జైల్లో ఉండగా.. జోగి రమేశ్ పేరు చెబుతాడని ఎలా తెలుసని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ప్రశ్నించారు. జోగి రమేశ్ తన సొంత సామాజికవర్గం వారి దగ్గర డబ్బులు తీసుకుని షిఫ్ట్ ఆపరేటర్ ఉద్యోగాలు ఇప్పించాడని ఆరోపించారు. పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, సీనియర్ నేత నెట్టెం రఘురాం తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ