తిరుపతి, 3 అక్టోబర్ (హి.స.)
దీపావళి పండగల సీజన్ సమీపిస్తుండటంతో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సౌకర్యార్థం పలు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రయాణికులకు, తిరుమల శ్రీవారి భక్తులకు అనువుగా ఉండేలా దక్షిణ మధ్య రైల్వే పలు సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది.
ఈ ప్రత్యేక రైళ్లలో భాగంగా తిరుపతి నుంచి సాయినగర్ షిర్డీకి (07637) ప్రతి ఆదివారం ఒక సర్వీసును నడపనున్నారు. ఈ రైలు ప్రతి ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు తిరుపతిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 10:45 గంటలకు షిర్డీకి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో షిర్డీ-తిరుపతి రైలు (07638) ప్రతి సోమవారం రాత్రి 7:35 గంటలకు షిర్డీలో ప్రారంభమై, బుధవారం మధ్యాహ్నం 1:30 గంటలకు తిరుపతికి వస్తుంది.
అలాగే తిరుపతి నుంచి జల్నాకు (07610) ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3:15 గంటలకు ప్రత్యేక రైలు బయలుదేరుతుంది. ఇది మరుసటి రోజు మధ్యాహ్నం 3:50 గంటలకు జల్నాకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో జల్నా-తిరుపతి రైలు (07609) ప్రతి సోమవారం ఉదయం 7 గంటలకు జల్నాలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 10:45 గంటలకు తిరుపతికి చేరుకుంటుందని అధికారులు తెలిపారు. ఈ రెండు రైళ్లు ఏపీలోని రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి వంటి ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV