
అమరావతి, 3 నవంబర్ (హి.స.)
అమరావతి రాజధానికి వెళ్లే సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణ పనుల్లో వేగం పుంజుకుంది. ఈ-3 రోడ్డును పాత జాతీయ రహదారికి అనుసంధానం చేసేందుకు కేఎల్రావు కాలనీ వద్ద కృష్ణా పశ్చిమ డెల్టా ప్రధాన కాలువపై స్టీల్ వంతెన నిర్మించేందుకు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏడీసీఎల్) రూ.70 కోట్లతో పనులు ప్రారంభించింది. 128 మీటర్ల పొడవున నాలుగు లైన్లుగా డెల్టా కాలువపై నిర్మించే స్టీల్ వంతెన ప్రకాశం బ్యారేజీ నుంచి ఉండవల్లి సెంటర్కు వెళ్లే మార్గంలో కేఎల్రావు కాలనీ వద్ద రోడ్డుకు అనుసంధానం చేస్తారు. దీని పనులు మూడు నెలల్లో పూర్తి చేయాలని సంకల్పించినట్లు ఏడీసీఎల్ ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. రాజధాని అమరావతికి వెళ్లే వాహనాలు కృష్ణా కరకట్ట మీద కాకుండా నేరుగా స్టీల్ వంతెన మీదుగా సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి వెళ్లిపోయే విధంగా వంతెన నిర్మాణం ప్రారంభించారు. ఇందుకుగాను పీడబ్ల్యూడీ వర్క్షాప్ వద్ద వంతెనకు సంబంధించి పిల్లర్ నిర్మాణ పనులు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ