
జమ్మూ, 5 నవంబర్ (హి.స.)
జమ్మూకశ్మీర్లో భద్రతా బలగాలు బుధవారం ఆపరేషన్ ఛత్రు ను చేపట్టాయి. కిష్తివాడ్ జిల్లాలో ముగ్గురు ఉగ్రవాదులు దాక్కున్నట్లు సమాచారం అందుకున్న భద్రతా బలగాలు ఉగ్రవాదులను చుట్టుముట్టాయి. దీంతో సైనికులకు, ఉగ్రవాదులకు మధ్య భారీగా ఎదురుకాల్పులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
కిష్తివాడ్లోని ఛత్రు ప్రాంతంలో ముగ్గురు ఉగ్రవాదులు కొన్ని నెలలుగా నక్కి ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారం అందుకున్న వెంటనే భారత సైన్యంలోని వైట్ నైట్ కార్ప్స్, కశ్మీర్ పోలీసుల సంయుక్త బృందాలు తెల్లవారుజామున సెర్చ్ ఆపరేషన్ను ప్రారంభించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఉగ్రవాదులను గుర్తించిన భద్రతా దళాలు వారిని చుట్టుముట్టాయి. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు