
అమరావతి, 16 డిసెంబర్ (హి.స.)
అనంత నగరపాలక, : అనంత వైకాపాలో వర్గపోరు రచ్చకెక్కింది. కోటి సంతకాల పేరుతో వైకాపా ఆధ్వర్యంలో చేపట్టిన జిల్లా స్థాయి కార్యక్రమంలో ఆ పార్టీ నేతల్లో విభేదాలు బహిర్గతం అయ్యాయి. సోమవారం ఆ పార్టీ జిల్లా కార్యాలయం నుంచి ప్రారంభమైన ద్విచక్ర వాహన ర్యాలీ గడియారస్తంభం ఉపరితల వంతెన మీదుగా సాగింది. ఉపరితల వంతెన మీద ద్విచక్ర వాహనాల్లో ముందు మేమే వెళ్లాలి అంటూ ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి సోదరుడు అనంత చంద్రారెడ్డి, ఉపమేయరు కొగటం విజయభాస్కర్రెడ్డి మధ్య వివాదం రేగింది. ముందు నుంచి ఇరువురి మధ్య వర్గపోరు నడుస్తోంది. సోమవారం ర్యాలీ మరింత ఆజ్యం పోసినట్లు అయ్యింది. ఇరువురు నువ్వెంత? అంటే నువ్వెంత? అంటూ ఒకరినొకరు వాహనం దిగకుండానే తిట్టుకున్నారు. ఇరువురు అనుచరుల మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. ఈ ఘర్షణలో యువకుడు ఆనంద్ తలకు దెబ్బ తగలడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ర్యాలీ కారణంగా ఇరుకు రోడ్లపై వాహనదారులు కదలలేని పరిస్థితి ఏర్పడింది. ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్లు తొలగించి పెద్దపెద్ద శబ్దాలతో హంగామా చేశారు. నడిమివంక నుంచి ఉపరితల వంతెన, గడియార స్తంభం, సప్తగిరి కూడలి, పాతూరు మార్కెట్ ఈ ప్రాంతాలన్నీ రద్దీ ప్రదేశాలు కావడంతో వాహనదారులు గంటసేపు ఇబ్బంది పడ్డారు. ర్యాలీలో వైకాపా జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీలు శివరామిరెడ్డి, మంగమ్మ, జడ్పీ ఛైర్పర్సన్ గిరిజమ్మ, మేయర్ వసీం, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ