
అమరావతి, 27 డిసెంబర్ (హి.స.)
చిప్పగిరి, చిప్పగిరి మండలంలోని మల్లప్పగేట్ నుంచి గుంతకల్లు తూర్పు రైల్వేస్టేషన్ వరకు పైవంతెన (రైల్ ఓవర్ రైల్) నిర్మాణానికి రూ.350 కోట్లు మంజూరయ్యాయి. సుమారు పది కి.మీ. పొడవు ఉండే ఈ వంతెన నిర్మాణానికి ముమ్మరంగా సర్వే చర్యలు చేపట్టారు. పైవంతెన పూర్తయితే బళ్లారి-డోన్ మధ్య రైలు ప్రయాణం సులభతరం కానుంది. పైగా గుంతకల్లు స్టేషన్లోకి వెళ్లే రైళ్లకు ఆటంకాలు తప్పనున్నాయి.
ప్రస్తుతం బళ్లారి, ఆదోని, డోన్, గుత్తి మార్గాల నుంచి వచ్చే రైళ్లు, గూడ్సులు ఒకే మార్గం నుంచి స్టేషన్లోకి రావాల్సి ఉండటంతో తీవ్ర జాప్యం జరుగుతోంది.
పైవంతెన నిర్మాణంతో బళ్లారి, ఆదోని, డోన్ మార్గం నుంచి వచ్చే కొన్ని రైళ్లు, గూడ్సులు స్టేషన్లో రాకుండా నేరుగా వెళ్లే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో ఇలాంటి వంతెనను గూడూరు లో నిర్మించారు. విజయవాడ వద్ద మరొకటి నిర్మాణంలో ఉంది. గుంతకల్లులో నిర్మిస్తే మూడోది అవుతుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ