వాషింగ్టన్: , 29 మార్చి (హి.స.)క్యాంపస్ ఆందోళనల్లో క్రియాశీలంగా వ్యవహరించిన అమెరికాలోని (USA) విదేశీ విద్యార్థులకు అక్కడి విదేశాంగ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లిపోవాలంటూ ఈమెయిల్స్ పంపినట్లు సమాచారం. కేవలం ఆందోళనల్లో పాల్గొన్నవారికే కాకుండా అక్కడి దృశ్యాలను, జాతి వ్యతిరేక సందేశాలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన విద్యార్థులకు కూడా హెచ్చరిక సందేశాలు పంపినట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో కొందరు భారతీయ విద్యార్థులు సైతం ఉండే అవకాశముంది. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయంతో అక్కడి విద్యార్థులు ఆన్లైన్లో యాక్టివ్గా ఉండటం వల్ల కలిగే పరిణామాలు, భావ ప్రకటనా స్వేచ్ఛ పరిమితులపై ఆందోళన రేకెత్తుతోంది.
జాతి వ్యతిరేక ప్రచారానికి పాల్పడుతున్న వారి సోషల్ మీడియా ఖాతాలను అమెరికా విదేశాంగశాఖ జల్లెడ పడుతోంది. ఒకవేళ అదే నిజమని తేలితే ఆ విద్యార్థులకు అమెరికాలో చదువుకునే వీల్లేకుండా తక్షణమే స్వదేశానికి పంపించే యోచనలో ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈమేరకు అమెరికా విదేశాంగశాఖ, కాన్సులేట్ అధికారుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువరించింది. ‘బ్యూరో ఆఫ్ కాన్సులర్ అఫైర్స్ వీసా’ నుంచి విదేశీ విద్యార్థులకు ఈమెయిల్స్ వెళ్తున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు