పుత్తూరు, , 19 ఏప్రిల్ (హి.స.)
: సైబర్ నేరగాళ్లు మరో దోపిడీకి తెరలేపారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి సతీమణి సుధా నారాయణమూర్తి, ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ సమావేశాల వీడియోలు ఏఐ సాంకేతికతో ఎడిట్ చేసి సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నారు. రూ.21 వేలు పెట్టుబడి పెడితే 28 రోజుల్లో రూ.17 లక్షలు వస్తుందని నమ్మబలుకుతున్నారు. ఆ వీడియోలు చూసి కొందరు గుడ్డిగా వారి చెప్పిన వెబ్సైట్లో పెట్టుబడి పెడుతున్నారు. రెండ్రోజులు ఆ వెబ్సైట్లో లాభాలు వస్తున్నట్లు చూపుతున్నారు. దీంతో పెట్టుబడిదారులు ఆ వెబ్సైట్ గురించి స్నేహితులు, బంధువులకు చెప్పి మరికొందరితో పెట్టుబడులు పెట్టిస్తున్నారు. ఈలోగా ఆ వెబ్సైట్ను సైబర్ నేరగాళ్లు మూసేస్తున్నారు. దీంతో డబ్బుపెట్టినవారు లబోదిబో మంటున్నారు. తిరుపతి జిల్లా రేణిగుంట మండలానికి చెందిన ఓ చిరుద్యోగి తొట్టంబేడులో పనిచేస్తున్నాడు. నాలుగైదు రోజులుగా ఫేస్బుక్లో నిర్మలా సీతారామన్, సుధా నారాయణమూర్తి, శక్తికాంతదాస్ పేరుతో వచ్చిన వీడియోలు చూసి రూ.21 వేలు పెట్టుబడి పెట్టాడు. రెండ్రోజులు ఆ వెబ్సైట్ లాభాలు చూపగా చివరన మొత్తం తీసుకోవచ్చనే ఆశతో ఉండగానే ఆ వెబ్సైట్ రాత్రికి రాత్రే మూసేశారు. దీంతో తాను రూ.21వేలు పోగొట్టుకున్నానని అతడు వాపోతున్నాడు. అతడి మాటలు విని పెట్టుబడి పెట్టినవారు సైతం ఇలానే మోసపోయారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల