సూళ్లూరుపేట, 19 ఏప్రిల్ (హి.స.), భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సన్నద్ధమవుతోంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం షార్ నుంచి మే 22న జీఎస్ఎల్వీ-ఎఫ్16 రాకెట్ ప్రయోగానికి సన్నాహాలు చేస్తోంది. ఈ రాకెట్ ద్వారా అమెరికాకు చెందిన నిషార్ ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపనుంది. ఇప్పటికే షార్లో రెండో ప్రయోగ వేదిక వద్దనున్న వెహికల్ అసెంబ్లీ బిల్డింగ్ (వ్యాబ్లో)లో రాకెట్ అనుసంధాన పనులు వేగంగా సాగుతున్నాయి. దీంతో పాటు పీఎస్ఎల్వీ-సీ61, ఎల్వీఎం-3-జీ1, ఎల్వీఎం3-ఎం5 రాకెట్ల అనుసంధాన పనులు కూడా జరుగుతున్నాయి. జీఎస్ఎల్వీ-ఎఫ్16 అనుసంధానానికి సంబంధించిన రాకెట్ పరికరాలు కేరళలోని తిరువనంతపురం నుంచి భారీ భద్రత నడుమ రోడ్డు మార్గాన రెండు ప్రత్యేక వాహనాల్లో శుక్రవారం షార్కు తీసుకొచ్చారు. ప్రయోగించే విదేశీ ఉపగ్రహాన్ని కూడా నెలాఖరులో షార్కు తీసుకురానున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల