ముంబై, 23 ఏప్రిల్ (హి.స.)
తులం బంగారం కొనాలా? అయితే లక్ష రూపాయలు దగ్గర పెట్టుకోండి.. లక్ష కాదు, అంతకమించి డబ్బులు రెడీ చేసుకోవాలి. ఎందుకంటే, బంగారం ధర ఇవాళ రిటైల్ మార్కెట్లో లక్ష మార్క్ను క్రాస్ చేసింది. ఒకప్పుడు 50 వేలకు తులం ఉన్న బంగారం, ఇప్పుడు డబుల్ అయింది. అక్షయ తృతీయకు ముందు పసిడి మెరుపులు మెరుస్తోంది. సరికొత్త మైలురాయిని చేరిన బంగారం ధర వినియోగదారులు ఆందోళనకు గురవుతున్నారు. బంగారం కొనాలంటేనే వెనుకడుగు వేస్తున్నారు. రిటైల్ మార్కెట్లో తొలిసారి రూ.లక్ష దాటింది. హైదరాబాద్లో ఒక్కరోజే రూ. 2,562 పెరిగిన 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,02,062 చేరుకుంది. లైవ్ మార్కెట్లో కూడా లక్షా రెండువేలకుపైగా గోల్డ్ ధర ఉంది. MCXలో కూడా పపిడి ధర రూ.1700 పెరిగింది.
అమెరికా పరిణామాలతో బంగారం ధరలు పెరుగుతున్నాయి. ట్రంప్ తీరుతో ఔన్స్ బంగారం ధర 3490 డాలర్లు దాటింది. బంగారం పరుగుకు డాలర్ బలహీనత కారణం అవుతోంది. డాలర్ ఇండెక్స్ మూడేళ్ల కనిష్టానికి పడిపోయింది. ఫెడ్ నిర్ణయాలపై ట్రంప్ జోక్యం చేసుకోవడంతో ఇన్వెస్టర్లకు భయాలు మొదలయ్యాయి. ఈ పరిస్థితుల్లో పసిడి ధర ఇంకా పెరగొచ్చనే అంచనాలు వస్తున్నాయి.
10 గ్రాముల బంగారం ధర అక్షరాలా లక్ష రూపాయలను దాటిన సందర్భంలో.. బంగారం ధర మైలు రాళ్లను కూడా ఓసారి చెప్పుకోవాలి. 1959లో మొదటిసారి వంద రూపాయల మార్క్ను తాకింది కనకం. ఆ తరువాత.. 1979లో మొదటిసారి వెయ్యి రూపాయల మార్క్ను టచ్ చేసింది. ఇక 2007లో ఫస్ట్టైమ్.. 10వేల రూపాయల గరిష్ట స్థాయిని చూసింది. 2011 ఆగస్టులో బంగారం ధర మొదటిసారిగా 25వేల మార్కును టచ్ చేసింది. 2020 జూలైలో అదే 10 గ్రాముల బంగారం ధర 50వేలు దాటింది. ఈ ఏడాది జనవరిలో 10 గ్రాముల పసిడి ధర 78వేల రూపాయలు. ఇవాళ 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి లక్ష రూపాయలను టాచ్ చేసింది. అంటే.. మూడంటే మూడే నెలల్లో లక్ష రూపాయలను తాకింది.
---------------
---------------
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి