లఖ్నవూ: , 26 ఏప్రిల్ (హి.స.)పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం పాక్ జాతీయులకు (Pakistani Nationals) వీసా సేవలు నిలిపివేసిన విషయం తెలిసిందే. ఆ దేశీయులకు జారీ చేసిన అన్ని వీసాలు 2025 ఏప్రిల్ 27 నుంచి రద్దు కానున్నాయని.. ఈ గడువు ముగిసేలోగా వారంతా భారత్ను వీడివెళ్లిపోవాలని విదేశాంగ శాఖ గురువారం ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో పాక్ జాతీయురాలు సీమా హైదర్ను (Seema Haider) దేశం నుంచి బహిష్కరిస్తారంటూ వార్తలు వచ్చాయి. దీనిపై ఆమె స్పందిస్తూ.. తనకు పాక్ వెళ్లే ఉద్దేశం లేదని, ఇక్కడే ఉండేందుకు అనుమతించాలని ప్రధాని నరేంద్రమోదీ, యూపీ సీఎం యోగిలకు విజ్ఞప్తి చేస్తూ తాజాగా వీడియో విడుదల చేసింది.
ఒకప్పుడు తాను పాకిస్థాన్ పౌరురాలు అయినప్పటికీ.. ఇప్పుడు భారత్ కోడలినని దయ చేసి తనను ఆ దేశానికి పంపొద్దని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. 2023లో తన ప్రియుడు సచిన్ మీనాను వివాహం చేసుకున్నప్పుడే తాను హిందూమతాన్ని స్వీకరించానని తెలిపింది. ఈవిషయంపై ఆమె తరఫు లాయర్ మాట్లాడుతూ.. పాకిస్థాన్పై దేశవ్యాప్తంగా వ్యతిరేకత ఉన్నప్పటికీ సీమా హైదర్ను దేశంలో నివసించడానికి అనుమతిస్తారని ఆశిస్తున్నానన్నారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు