నిజామాబాద్, 13 జూన్ (హి.స.)
నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆవరణలో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. సూసైడ్ కు పాల్పడిన వ్యక్తి జుక్కల్ మండలం మహమ్మదాబాద్ గ్రామానికి చెందిన పొనుగంటి సాయిలు (37) గా గుర్తించారు. మృతుడు సాయిలు భార్య సంగీత కు ఈనెల 6న ఆస్పత్రి వైద్యులు డెలివరీ చేయగా, మగ బిడ్డ పుట్టి చనిపోయింది.
పుట్టిన బిడ్డ చనిపోవడం, అనారోగ్యంతో నీరసించి పోవడం కారణంగా సంగీత పల్స్ రేట్ పడిపోయి ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో ఆస్పత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. పుట్టిన బిడ్డ పురిట్లోనే చనిపోవడం, భార్య ఆరోగ్య పరిస్థితి క్షీణించడం సాయిలును ఆవేదనకు గురి చేశాయి. మరోపక్క అప్పుల బాధతో మనస్తాపం చెందిన సాయిలు గురువారం అర్ధరాత్రి దాటాక ఆస్పత్రి ఆవరణలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..