హైదరాబాద్, 18 జూన్ (హి.స.)అహ్మదాబాద్ ఎయిరిండియ ప్రమాదంలో మరణించిన వారి గుర్తింపు వేగవంతంగా జరుగుతోంది. విమానంలో 242 మంది ఉంటే ఇందులో ఒక్కరు మినహా అందరూ మరణించారు. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడటంతో ప్రయాణికుల మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. దీంతో, మృతదేహాలను గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్షలు చేస్తున్నారు.
ఈ ప్రమాదంలో మరణించిన వారిలో 202 మంది బాధితులను గుర్తించారు. ఇప్పటి వరకు 157 మృతదేహాలను కుటుంబాలకు అప్పగించారు. మిగిలిన 33 కేసుల గుర్తింపు ప్రక్రియ వివిధ దశల్లో ఉంది. ఐదుగురు బాధితుల డీఎన్ఏ టెస్టులు కొనసాగుతుండగా, 15 మృతదేహాల కుటుంబ సభ్యుల నుంచి అదనపు శాంపిళ్ల కోసం వేచి చూస్తున్నారు. మరో 10 మృతదేహాలను బంధువులకు అప్పగించే దశలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెప్పాయి. డీఎన్ఏ పరీక్షల తర్వాత విదేశీ ప్రయాణికుల మృతదేహాలను ఆయా దేశాలకు పంపుతున్నారు. చనిపోయిన వారిలో 2 మృతదేహాలను విదేశాలకు పంపగా, 11 మృతదేహాలను గుజరాత్ నుంచి ఇతర రాష్ట్రాలకు తరలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు