తెలంగాణ, వరంగల్. 18 జూన్ (హి.స.)
వరంగల్ నగరంలోని ప్రధాన కూడళ్లల్లో వాహనదారులకు ఇబ్బందులు లేకుండా ప్రయాణించే విధంగా ఫ్రీ లెఫ్ట్ ఏర్పాటు చేయాలని వరంగల్ అడిషనల్ డీసీపీ రాయల ప్రభాకర్ రావు ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు. వరంగల్ ప్రధాన సెంటర్లైన ఎంజీఎం జంక్షన్, పోచమ్మ మైదాన్ జంక్షన్, వరంగల్ చౌరస్తా, పోస్టాఫీస్ జంక్షన్లను బుధవారం ఉదయం వారు సందర్శించి ట్రాఫిక్ సిగ్నల్స్ కు అడ్డుగా ఉన్న పాత సిగ్నల్ పోల్స్ ను వెంటనే తొలగించాలని ఆదేశించారు. పోచమ్మ మైదాన్ జంక్షన్లో దేశాయిపేట వైపుగా, హెడ్ పోస్టాఫీస్ సెంటర్లో అండర్ బ్రిడ్జి టు చౌరస్తా ఫ్రీ లెఫ్ట్ కోన్స్ ఏర్పాటు చేయాలని, వరంగల్ చౌరస్తాలో వున్న మ్యాన్ హోల్ గూర్చి మున్సిపల్ ఏఈ దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. అనుక్షణం ట్రాఫిక్ సిబ్బంది అలర్ట్ గా ఉండి ప్రజలకు ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు