తెలంగాణ, సంగారెడ్డి. 2 జూన్ (హి.స.)
రాష్ట్రంలోని ఆడబిడ్డలను
కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సోమవారం రాష్ట్ర అవతరణ వేడుకలు సంగారెడ్డిలోని పోలీసు పరేడ్ మైదానంలో నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి పోలీసు గౌరవ వందనం స్వీకరించి జిల్లా ప్రజల నుద్దేశించి మాట్లాడుతూ ఆడబిడ్డలు ఆనందంగా ఉన్న ఇంట మహాలక్ష్మి తాండవిస్తుందన్నారు. ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. సంపన్నులతో సమానంగా తెలంగాణ మహిళలతో విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. అదే విధంగా మహిళలు పెట్రోల్ బంకులు, మహిళా శక్తి క్యాంటిన్లు, మహిళా సంఘాల ద్వారా బస్సులను కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకు ఇవ్వాలని నిర్ణయించడం జరిగిందన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు