అమరావతి, 2 జూన్ (హి.స.)
విజయవాడ: ఇప్పటి వరకు 34.81 లక్షల మందికి రేషన్ సరకులు అందించామని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 3.73 లక్షల మంది వృద్ధులు, దివ్యాంగులకు ఇంటింటికీ వెళ్లి రేషన్ సరకులు అందించామన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వృద్ధులు, దివ్యాంగులకు ఈ నెల 5లోగా రేషన్ ఇవ్వాలని డీలర్లను ఆదేశించినట్లు చెప్పారు. కొన్ని చౌకధరల దుకాణాల వద్ద సర్వర్ సమస్యలు తలెత్తాయని, వెంటనే పరిష్కరించి పంపిణీ కొనసాగించినట్లు చెప్పారు. ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ దుకాణాలు తెరిచే ఉంటాయని, పనులు మానుకొని రేషన్ దుకాణాలకు వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పారు. కార్డుదారులకు మరింత సౌకర్యం కల్పిస్తూ.. ఏ దుకాణానికైనా వెళ్లి రేషన్ తీసుకునేలా పోర్టబులిటీ తీసుకొచ్చినట్లు తెలిపారు. ప్రతి డీలర్కు 10 శాతం ఎక్కువగా సరకులు సరఫరా చేసినట్లు చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ