అమరావతి, 12 జూలై (హి.స.)
గుడివాడ: గుడివాడ నియోజకవర్గంలో సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా గుడివాడ మండలం లింగవరంలో వైకాపా నేత కొడాలి నానికి చెందిన కె. కన్వెన్షన్లో నియోజవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. అదే సమయంలో సుపారిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీ ర్యాలీగా నాగవరప్పాడు సెంటర్కు చేరుకున్నాయి. ఈ క్రమంలో నాగవరప్పాడు సెంటర్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
వైకాపా సమావేశానికి ఆహ్వానం పలుకుతూ నాగవరప్పాడు సెంటర్లో ఆ పార్టీ నేతలు ప్రత్యేక బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఆ సమయంలో తెదేపా నాయకులు.. ‘జై తెలుగుదేశం... గుడివాడ గడ్డ రామన్న అడ్డా..’ అని నినాదాలు చేస్తూ గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము చిత్రపటానికి పాలాభిషేకాలు చేశారు. తేదేపా ర్యాలీలోంచి కొందరు నాయకులు వైకాపా బ్యానర్లను చించేశారు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. కొడాలి నానికి చెందిన కె. కన్వెన్షన్లోకి వెళ్లేందుకు తెదేపా నేతలు ప్రయత్నించారు. వైకాపా సమావేశానికి వెళ్తున్న జడ్పీ ఛైర్మన్ కారును తెదేపా శ్రేణులు అడ్డుకున్నాయి. విషయం తెలుసుకున్న వైకాపా నేతలు కె.కన్వెన్షన్ నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. అక్కడే ఉన్న డీఎస్పీ ధీరజ్ వినీల్ నేతృత్వంలోని పోలీసులు వారు బయటకు రాకుండా నిలువరించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో నాగవరప్పాడు సెంటర్లో పోలీసు బలగాలు మోహరించాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ