తెలంగాణ, మంచిర్యాల. 15 జూలై (హి.స.) వాహనాలకు సరైన నెంబర్ ప్లేట్లు కచ్చితంగా ఉండాలని మంచిర్యాల ఏసీపీ ఆర్.ప్రకాష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పలు ఏరియాల్లో స్పెషల్ పార్టీ సిబ్బందితో కలిసి వారు మంగళవారం వాహనాల తనిఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు, వాటిని గుర్తించి అక్కడికక్కడే నెంబర్ ప్లేట్ ఫిట్ చేయించి పైన్లు వేస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా కావాలని నెంబర్ ట్యాంపరింగ్కు పాల్పడిన వారు ఉన్న, నాలుగు అంకెల నెంబర్లను రెండు అంకెల నెంబర్ గా మార్చి చెక్కర్లు కొడుతున్న వారిని గుర్తించి వారిపై చీటింగ్ కేసు లు నమోదు చేస్తున్నట్లు వెల్లడించారు.
నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ చేయడం ద్వారా దొంగతనాలకు పాల్పడుతున్నారని, ఈ మధ్య కాలంలో బెల్లంపల్లి లో జరిగిన ఏటీఎం చోరీ కేసులో దొంగలు నెంబర్ లేని వాహనాన్ని వినియోగించారని పోలీసులు గుర్తించి వారిని పట్టుకున్న ఘటనను గుర్తు చేశారు. అలాంటి పరిస్థితులు పునరావృతం కాకూడదనే ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు