తిరుమల, 27 జూలై (హి.స.)కలియుగ దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ఈ క్రమంలో ప్రపంచ నలుమూలల నుంచి శ్రీవారి భక్తులు తిరుమల కొండకు చేరుకుని భక్తి శ్రద్దలతో మొక్కులు చెల్లించుకుంటారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా టీటీడీ మరో కీలక ప్రకటన చేసింది.
టీటీడీ అలిపిరిలోని సప్త గో ప్రదక్షిణ మందిరంలో ప్రతి రోజు నిర్వహించే శ్రీశ్రీనివాస దివ్యానుగ్రహం టికెట్లను ఇకపై ఆన్లైన్లో మాత్రమే జారీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ తరుణంలో వచ్చే నెల(ఆగస్టు) 1వ తేదీ నుంచి ఆన్లైన్ ద్వారానే ఈ టికెట్ల విక్రయం జరుగుతుందని పేర్కొంది. ప్రజెంట్ భక్తుల(Devotees)కు కరెంట్ బుకింగ్ ద్వారా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే, తిరుమల భక్తుల విజ్ఞప్తి మేరకు శ్రీవారి పాదాల వద్ద తమ శుభకార్యాలు, విశేషమైన రోజుల్లో స్వామి వారి అనుగ్రహం కోసం యజ్ఞం నిర్వహించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఈ హోమంలో రూ.1600 చెల్లించి ఇద్దరు భక్తులు పాల్గొనవచ్చు. ఈ విశేష హోమంలో పాల్గొన్న గృహస్థులకు రూ.300ల ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పిస్తారని టీటీడీ(TTD) పేర్కొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి