చెన్నై న్యూఢిల్లీ: , 18 ఆగస్టు (హి.స.),తమిళనాడు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, డీఎంకే డిప్యూటీ సెక్రటరీ జనరల్ పెరియసామి నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనిఖీలు చేసింది. దిండుక్కల్లోని గోవిందపురం దురైనగర్లో ఉన్న మంత్రి గృహంతో పాటు సీలప్పాడిలోని ఆయన కుమారుడు, పళని ఎమ్మెల్యే సెంథిల్కుమార్, కుమార్తె ఇందిర ఇళ్లు, ఇతర ప్రాంతాల్లోనూ ఈడీ అధికారులు సోదాలు చేశారు. శనివారం ఉదయం ప్రారంభమైన ఈ సోదాలు సుమారు 15 గంటల పాటు కొనసాగాయి. ఆస్తులు, పెట్టుబడుల పత్రాలు, కంపెనీ బ్యాంకుఖాతాలు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 2008లో హౌసింగ్బోర్డు గృహాల కేటాయింపులో అవకతవకలు జరిగాయని అప్పటి గృహనిర్మాణ శాఖ మంత్రి పెరియసామిపై ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించి అన్నాడీఎంకే హయాంలో అవినీతి నిరోధక శాఖ కేసు నమోదుచేసింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలూ ఆయనపై వచ్చాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ