ఈటానగర్:న్యూఢిల్లీ,22,సెప్టెంబర్ (హి.స.) ప్రధాని మోదీ సోమవారం అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఇరు రాష్ట్రాల్లోనూ సుమారు రూ.5 వేల కోట్ల విలువైన వివిధ మౌలిక వసతుల ప్రాజెక్టులను ఆవిష్కరించడంతో పాటు పలు అభివృద్ధి పనులనూ ప్రారంభిస్తారు. జల విద్యుదుత్పత్తికి ఎంతో అనువుగా ఉండే అరుణాచల్లో రూ.3,700 కోట్లతో నిర్మించనున్న తాతో-1, హియో జల విద్యుత్ కేంద్రాలు ప్రధాని శంకుస్థాపన చేసే ప్రాజెక్టుల జాబితాలో ఉన్నాయి. వీటితోపాటు 9,820 అడుగుల ఎత్తున ఉండే తవాంగ్లో నిర్మించనున్న భారీ కన్వెన్షన్ సెంటర్కూ ఆయన శంకుస్థాపన చేస్తారు. తొలుత ఈటానగర్లో పర్యటించే ప్రధాని.. శంకుస్థాపనలు, ప్రారంభ కార్యక్రమాల అనంతరం ప్రజలను ఉద్దేశించి సభలో ప్రసంగిస్తారు. అనంతరం త్రిపుర బయలుదేరుతారు. శక్తిపీఠాల్లో ఒకటైన గోమతి జిల్లా ఉదయ్పుర్లోని మాతా త్రిపుర సుందరి ఆలయ సముదాయం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఈ పర్యటనలో ప్రధాని వివిధ వర్గాల ప్రతినిధులతో సమావేశమవుతారని పీఎంవో ఓ ప్రకటనలో తెలిపింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు