
ఢిల్లీ,22, జనవరి (హి.స.): అయోధ్యలోని అంతర్జాతీయ ‘రామకథ’ సంగ్రహాలయానికి 233 ఏళ్ల కిందటి అరుదైన వాల్మీకి రామాయణం (తత్వదీపికతో) సంస్కృత రాతప్రతులను కానుకగా అందజేసినట్లు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర సంస్కృత విశ్వవిద్యాలయ వైస్ఛాన్సలర్ శ్రీనివాస వరఖేడీ చేతుల మీదుగా ప్రధానమంత్రుల సంగ్రహాలయం, గ్రంథాలయ కార్యనిర్వాహక మండలి ఛైర్మన్ నృపేంద్ర మిశ్రకు మైలురాయిలాంటి ఈ సాంస్కృతిక అప్పగింత జరిగినట్లు పేర్కొంది. మహేశ్వర తీర్థ శాస్త్రీయ వ్యాఖ్యానం (టీకా)తో ఉన్న 1792 నాటి ఈ వాల్మీకి రామాయణాన్ని సంస్కృతం (దేవనాగరి లిపి)లో రాసి ఉన్నట్లు ప్రకటనలో వివరించింది. తాత్విక లోతును ప్రతిబింబించే ఈ ఇతిహాసం బాలకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ అనే అయిదు విభాగాలుగా ఉంది. గతంలో రాష్ట్రపతి భవన్కు అందజేసిన ఈ కావ్యాన్ని ఉత్తర్ప్రదేశ్లోని ‘రామకథ’ మ్యూజియానికి శాశ్వత బహుమతిగా ఇస్తున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ