
లిబియా, 10 ఫిబ్రవరి (హి.స.)
జీవితంలో ఎన్నో ఆశలతో వలస మార్గాన్ని ఎంచుకునే అమాయక ప్రజల ప్రాణాలు మధ్యధరా సముద్రం (Mediterranean Sea)లో కలిసిపోతున్నాయి. మెరుగైన భవిష్యత్తు కోసం ఆశతో ఆఫ్రికా తీరం (Coast of Africa) దాటి యూరప్ వెళ్లాలనుకున్న వలసదారుల కలలు మధ్యధరా సముద్రంలోనే ఆవిరవుతున్నాయి. గతంలో ఎంతో మంది ఇలా సముద్రంలో ప్రాణాలు కోల్పోయినప్పటికి.. బతుకుదెరువు కోసం నిత్యం వందలాది మంది తమ ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా లిబియా తీరం (Libyan coast)లో జరిగిన ఘోర పడవ ప్రమాదంలో ఇద్దరు పసికందులు సహా 53 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయవిదారక ఘటనలో కేవలం ఇద్దరు నైజీరియా మహిళలు మాత్రమే ప్రాణాలతో బయటపడగా, వారి కళ్ల ముందే తమ కుటుంబ సభ్యులు సముద్రంలో మునిగిపోయారు.
తాజా పడవ ప్రమాదంపై ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ వలస సంస్థ (IOM) కీలక వివరాలను వెల్లడించింది. ఈ వివరాల ప్రకారం.. సుమారు 55 మంది వలసదారులతో కూడిన రబ్బరు బోటు (Rubber boat) ఫిబ్రవరి 5 గురువారం రాత్రి 11 గంటల సమయంలో లిబియాలోని జావియా (Al-Zawiya) నగరం నుండి బయలుదేరింది. ప్రయాణం మొదలైన ఆరు గంటలకే, సముద్రపు అలల ఉధృతికి బోటులోకి నీరు చేరి జువారా (Zuwara) తీరానికి సమీపంలో బోల్తా పడింది. ప్రాణాలతో బయటపడిన ఇద్దరు మహిళల్లో ఒకరు తన భర్తను కోల్పోగా, మరొకరు తన ఇద్దరు పసిబిడ్డలను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. ఈ ప్రమాదంతో మొత్తం 53 మంది ప్రాణాలు (53 people died) కోల్పోయారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV