
అమరావతి, 12 ఫిబ్రవరి (హి.స.): బంగారం, డబ్బు కోసం పట్టపగలు ఓ దుండగుడు మహిళ గొంతు నులిమి హత్య చేసిన ఘటన నగరంలో సంచలనం సృష్టించింది. ఆరిలోవ సీఐ మల్లేశ్వరరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆరిలోవ పాతపోలీస్స్టేషన్కు ఎదురుగా కనకదుర్గనగర్లో కాపు రమణ, లక్ష్మి (45) దంపతులు నివాసం ఉంటున్నారు. రమణ జీవీఎంసీ ఉద్యాన విభాగంలో పనిచేస్తున్నారు. బుధవారం ఉదయం 9గంటలకు విధులకు వెళ్లారు. లక్ష్మి ఒక్కరే ఇంట్లో ఉండగా ఉదయం 10.15 గంటలకు సుమారు 35ఏళ్ల వయసున్న దుండగుడు ఇంట్లోకి ప్రవేశించాడు. ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలో ఈ దృశ్యం రికార్డయింది. పరిసరాలను పరిశీలించిన అతను తిరిగి వెళ్లిపోయాడు. తర్వాత మళ్లీ 11 గంటల సమయంలో నెత్తిపై టోపీ, ముఖానికి మాస్క్ ధరించి వచ్చాడు.
ఇంట్లోకి ప్రవేశించి లక్ష్మిపై దాడిచేసి గొంతునులిమి చంపేశాడు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న 8తులాల బంగారు ఆభరణాలు, బీరువాలో ఉన్న రూ.5 లక్షల నగదును తీసుకుని వెళ్లిపోయాడు. సాయంత్రం 5గంటలకు ఇంటికొచ్చిన రమణ భార్యను పిలిచినా స్పందించలేదు. అచేతనంగా పడి ఉండటం.. ముక్కులో నుంచి రక్తం వచ్చి ఉండటం గమనించారు. బంగారం, నగదు లేకపోవడంతో కుమార్తె, కుమారుడు, అల్లుడికి తెలిపారు. సమాచారం అందుకున్న ఆరిలోవ పోలీసులు అంబులెన్స్ను పంపించారు.
అంబులెన్స్ సిబ్బంది వచ్చి పరిశీలించగా అప్పటికే లక్ష్మి మరణించినట్లు ధ్రువీకరించారు. క్లూస్టీం ఘటనా స్థలిలో ఆధారాలను సేకరించింది. బాగా రెక్కీ నిర్వహించిన వ్యక్తే ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. భర్త రమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.
మృతురాలి కుమార్తె, కుమారుడు, బంధువులు అక్కడికి సమీపంలో నివాసం ఉంటున్నా సాయంత్రం వరకు ఆమె మృతిచెందిన విషయం గుర్తించలేకపోయారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ